నా ఐరోపా యాత్ర - 7 (పోలాండ్)Back to list

అక్కడ ఉన్న టూరిస్టులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి వదనాల్లో విచారమే తప్ప ఉత్సాహం లేదు. రుస్కి ఎంట్రన్స్ అంటే రష్యా యుద్ధ ఖైదీలని తీసికెళ్ళే ద్వారం అది. ఇప్పుడు కాంపులోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. వెళ్ళే దారిలో ఆ ప్రాంతాన్ని దర్శించి నివాళులర్పించిన వివిధ దేశాల అధ్యక్షుల వివరాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టారు.వాటిని దాటుకుంటూ టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే మనిషికి 25 జిలోటీ లు పోలిష్ భాష అయితే 15 జిలోటీలు ప్రవేశ రుసుము. 20 మందికి ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ చెప్పేది వినటానికి ఒక ఎలెక్ట్రానిక్ రేడియో మరియు హెడ్ ఫోన్స్ ఇస్తారు. మనం గుంపులో ఉన్నా ఆ గైడ్ చెప్పేది స్పష్టంగా వినపడుతుంది. ఈ కాంపు మూడు భాగాలుగా నిర్మించారు. ఆష్విత్జ్ - 1 లోకి మేము ఇప్పుడు వెళ్ళబోయేది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీలని, యూదులని ఉంచటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ప్రాంతాన్ని ప్రతిపాదించాడు. రైలు మార్గం అనువుగా ఉండటంతో అన్ని దేశాలనుండి యూదులని ఇక్కడికి తరలించటానికి అనువుగా ఉంటుందని జర్మన్ నాజీ ఆఫీసర్ హిమ్లర్ ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ గ్రామంలో అప్పటికే ఉన్న 1200 మందిని ఖాళీ చేయించి 40 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని నాజీ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 300 మంది యూదుల చేత దీనికి పునాది రాళ్ళు వేయించి, తరువాతి కాలంలో ఇక్కడి ఖైదీల చేతనే మిగతా 2 బ్లాకులు కట్టించారు.

ఇక్కడికి రైళ్ళలో ఒక్కో పెట్టెలో 200 మందిని కుక్కి 3 రోజుల పాటు ప్రయాణించాక రైళ్ళు ఇక్కడికి చేరుకునేవి. అవి ఇక్కడికి చేరుకునేలోపే ఆ పెట్టెల్లో సగం మంది చనిపోయేవారు. మిగిలిన వారిని ఇక్కడ చంపేసేవారు.కేవలం ఈ ఆశ్విత్జ్ కాంపుల్లో చంపబడ్డ మనుషుల సంఖ్య దాదాపు 12 లక్షలు. మనుషుల్ని తీసుకురావటానికి నేరుగా రైలు మార్గాన్ని కాంప్ లోపలికే నిర్మించారు. యూరప్ లో అన్ని దేశాలనుండి యూదులని, యుద్ధఖైదీలని రైళ్ళలో ఈ కాంపుకి తరలించేవారు. రైలు దిగగానే నాజీ డాక్టర్లు, కమాండర్లు వారిని పరీక్షించేవారు. కొంచెం శారీరకంగా ధృడంగా ఉన్నవారిని ఒక పక్కకి, మిగతా వారిని నేరుగా చంపటానికి వేరు చేసేవారు. ఆరోగ్యం గా ఉన్నవారిని కొంతకాలం పని చేయించుకుని వారిలో సత్తువ అయిపోగానే చంపేసేవారు. కొత్త బాచ్ మనుషులు వచ్చినపుడు గదులు ఖాళీ లేకపోతే వెంటనే వచ్చిన వారిని చంపేయటమో లేక అప్పటికే కాంపులో బలహీనంగా ఉన్న వారిని ఆఘమేఘాల మీద కాల్చేసి, కొత్తవారిని ఆ గదుల్లో ఉంచేవారు. మా గైడ్ తో పాటు ఉన్న 20 మందిలో మేము నలుగురం ఇండియన్స్ ,మార్చిన్ కూడా మాతోనే ఉన్నాడు. గైడ్ ని అనుసరిస్తూ ఆ సువిశాల ప్రాంగణంలోకి ప్రవేశించాం. అప్పటికే అక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు.అక్కడ నిర్మించిన బ్లాకులన్నీ దేశాల వారిగా పేర్లు పెట్టారు. అంటే ఆక్రమిత దేశాలనుండి తీసుకు వచ్చే యూదులందరినీ ఆయా దేశాల పేరుతో నిర్మించిన బ్లాకులో ఉంచేవారు. మేము ప్రవేశించిన బ్లాకు కి పేరు ఏమీ లేదు. అక్కడి యుద్ధ ఖైదీలు వాడిన దుస్తులు, బూట్లు, వారి వస్తువులు, వికలాంగులు వాడే చేతి కర్రలు అక్కడ కుప్పలుగా పోసి ఉన్నాయి. వచ్చిన ఖైదీలకి బంగారు దంతాలు ఉంటే వాళ్ళు బతికుండగానే నాజీలు అవి పీకేసేవారట. మొదటి బ్లాకు చూడటం పూర్తవగానే శశి బయటకి వచ్చి అక్కడ ఒక మెట్టు దగ్గర కూలబడిపోయాడు. అసలేం జరిగింది ఇక్కడ ? అసలు మనుషుల్ని ఇలా చంపటం ఏంటి అంటూ ఇక నేను చూడలేను మీరు వెళ్ళండి అని అక్కడే ఉండిపోయాడు. ఉదయ అమ్మణ్ణ నాతో పాటే వచ్చాడు. మార్చిన్, నేను, చోటు రామ్ కలిసి తరువాతి బ్లాకు కి వెళ్ళాం. మార్చిన్ కి అన్నీ తెలిసి ఉండటంతో మేము మా గ్రూపు నుండి విడిపోయి సొంతంగా తిరగటం మొదలు పెట్టాం. తరువాతి బ్లాకులో ఆ కాంపులో చంపబడ్డ మనుషుల ఫోటోలు వారు వాడిన తిండి పాత్రలు ఉన్నాయి. హిట్లర్ యుద్ధాన్ని ఒక సంస్థ ని నడిపినట్టే నడిపాడు. బతికున్న ముడి పదార్ధాలని నిర్జీవంగా చెయ్యటం ఈ ఫాక్టరీ యొక్క పని.  మనుషుల్ని చంపటానికి నాజీలు ఉపయోగించిన పద్ధతులు వింటే మన హృదయం ద్రవించక మానదు. రోజుకి 4000 మంది నుండి 6000 మందిని చంపాలనేది టార్గెట్. గాస్ చాంబర్లు, శవాలని కాల్చే ఫర్నేస్ లు 24 గంటలు పని చేస్తూ ఉండేవి. వారానికొకసారి స్నానం అనే నెపంతో టాయ్లెట్ అని రాసున్న గదుల్లోకి ఖైదీలని పంపేవారు. ఒక్కో బాత్రూంలోకి 50 మందిని పంపి పైన ఉన్న షవర్ ఆన్ చెయ్యగానే గ్యాస్ విడుదలయ్యి లోపల ఉన్న వాళ్ళంతా శవాలుగా మారేవాళ్ళు. ఆ తరువాత పక్కనే ఉన్న ఫర్నేస్ లో వారిని తగలబెట్టేసేవాళ్ళు ఇదంతా 20 నిముషాల్లో పూర్తయ్యేది. రోజూ కొన్ని వేల శవాలు కాలుతుండటంతో ఈ ప్రాంతం అంతా పొగ, దుర్వాసనతో నిండి ఉండేది.

వాటి మధ్యే మిగిలిన ఖైదీలు ఉండేవారు. నాజీలు ఎంత కర్కోటకులంటే ఏదైనా బారక్ లో ఖైదీ కనపడకపోతే ఆ బారక్ లో ఉన్న మిగతా పదిమందిని చంపేసే వాళ్ళు. ఆ భయంతో తోటి వాళ్ళు తప్పించుకోకుండా సహా ఖైదీలే కాపలా కాసేవాళ్ళు. ఆ కాంపులోకి తీసుకు వచ్చిన ప్రతి ఖైదీ వివరాలు రికార్డ్ చేశారు. వాళ్ళు పట్టుబడిన ప్రాంతం,కాంపులోకి తీసుకు వచ్చిన తేదీ,వారిని చంపిన తేదీ, అందుకు వాడిన పద్ధతులు కూడా రికార్డ్ చేశారు. అంతే కాక ప్రతి వ్యక్తినీ ఫోటో తీశారు. కాంపుకి వచ్చినపుడు తీసిన ఫోటోకి తరువాతి మూడునెలల తర్వాత అదే మనిషి ఫోటోకి అసలు పోలికలే లేవు. ఆ ఫోటోలన్నీ ఇక్కడ ప్రదర్శనలో చూడచ్చు.మగ వాళ్ళకి ఆడవాళ్ళకి విడి విడిగా బారక్ లు ఉన్నయి.ఇక్కడికి వచ్చిన వాళ్ళ సగటు జీవితం మూడు నెలల కంటే ఎక్కువ ఉండేది కాదట.ఒక్కో గదిలో 400 మందిని ఉంచేవారు. ఆ మంచాలు ఇప్పటికీ యధాతధంగా ఉన్నాయి. ఎలుకలు, చలి తో సహవాసం. ఎవరికీ అక్కడినుంచి తప్పించుకునే ఆలోచన కూడా వచ్చేది కాదట.ఇన్ని లక్షలమందిలో తప్పించుకోవటానికి చూసిన 802 మందిలో 700 మంది తిరిగి పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారంతా కొద్ది గంటల్లోనే చంపబడ్డారు. పట్టుబడగానే ఒక గోడ ముందు నిలబెట్టి తుపాకీతో కాల్చేసే వారు. ఇప్పుడు ఆ గోడ లేదు కాని అదే నమూనాతో గోడని నిర్మించారు. అక్కడ చనిపోయిన వారి స్మారకార్ధం సందర్శకులు కొవ్వొత్తులు పెడతారు. మేము ఆ గోడ దగ్గర నిలబడి కాసేపు శ్రద్ధాంజలి ఘటించాం.

ఈ కాంపు కి ఖైదీల తాకిడి ఎక్కువవటంతో సామర్ధ్యం సరిపోక అస్విత్జ్ - 2 ఆస్విత్జ్ -3 కాంపులని 1942 - 43 ప్రాంతాల్లో నిర్మించారు. కొంచెం బలిష్టంగా ఉన్న యూదులని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాక్తరీల్లో పని చెయ్యటానికి తీసుకు వెళ్ళేవాళ్ళు. ఒక ఎండిపోయిన బ్రెడ్ మరియు సూప్ ఆహారంగా ఇచ్చి రోజంతా పని చేయించేవాళ్ళు. రెండు మూడు నెలల్లోనే వారు నీరసించి మరణించే వాళ్ళు. ఒకసారి గ్యాస్ కొరత ఏర్పడి జనాలని చంపటానికి ఇబ్బంది ఏర్పడటంతో, కొన్ని వేల మందిని మంచులో నడిపించుకుంటూ కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నడక పూర్తయ్యేలోపు సగం మంది ఆ చలికి దారిలోనే ప్రాణాలు వదిలారు. నడవలేని వారిని నాజీలు ఎక్కడికక్కడ కాల్చి చంపారు. చరిత్రలో దీనిని డెత్ వాక్ గా పిలిచారు. 22 వ బారక్ లో అతిచిన్న డార్క్ రూము చూశాం. ఒక మనిషి నిలబడగల రూం అది. అందులో 4గురు మనుషుల్ని పెట్టేవారు, వారు నిలబడే ఉండాలి గాలి వెలుతురూ లేదు,ఒక రోజులోనే ఆ నలుగురూ శవాలయ్యేవారు. యూదుల రక్తంతో వారి హాహాకారాలతో ఈ నేల ఎంతటి పాపాలకి వేదిక అయ్యిందో తలచుకోగానే కళ్ళ వెంట అప్రయత్నంగానే జల జలా నీళ్ళు కారాయి. నాతో పాటు ఉన్న మార్చిన్ కూడా ఒక్కో చోట నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే 30 లక్షలమంది పోలాండ్ వాసులే ఈ యుద్ధంలో చనిపోయారు. అది కూడా తమ దేశంలో నిర్మించిన ఈ మృత్యు సౌధంలో 12 లక్షలమంది చంపబడ్డారు.10 వ నంబర్ బారక్ వైపు చూపిస్తూ మార్చిన్ చెప్పిన విషయం వింటే కడుపులో దేవినట్లైంది.....

మిగతా భాగాలకి ఇక్కడ క్లిక్ చేయండి

Dated : 16.08.2013