నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)Back to list

నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)

యూదులు పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. క్రీస్తు పూర్వం ఈ మతం ఉంది. వీరి దేవుడు మెసయ్య ఎప్పటికైనా వస్తాడని నమ్ముతారు . వీరి ప్రార్ధనా మందిరాలని సినగోగాస్ అంటారు. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. అక్కడ  ఏసుక్రీస్తును శిలువ చేసి చంపిన తరువాత యూదులు భయకంపితులై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చెల్లాచెదురుగా ఐరోపా, అమెరికాలకు వలస పోయి అక్కడ స్థిరపడ్డారు.మరి కొంతమంది అమెరికా కి వెళ్లారు. ఇలా వెళ్ళిన వారంతా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆ దేశపు పౌరులుగానే ఉండిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున ఎంతో మంది యూదులు పోరాడారు. మెడల్స్ సంపాదించారు. కాని హిట్లర్ కి ఎందుకో యూదుల వల్లే కుట్ర జరిగి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని నమ్మాడు. వారి నిర్మూలనే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మనుషుల్లో ఉండే జెనెటిక్ లక్షణాల ఆధారంగా వారిని వేర్వేరు జాతులుగా పేర్కొన్నాడు. జర్మనీ వాసుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరించి వారిని మిగతా జాతుల వారితో కలవకూడదని ఆజ్ఞాపించాడు. తాను 1934 లో అధికారంలోకి రాగానే ఈ యూదు విద్వేష  చర్యల్ని చేపట్టాడు. యూదులని అధమజాతి పౌరులుగా ప్రకటించి వారిని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. 1938 లో ఒక యూదు ఈ పరిణామాలకి ఎదురు తిరగటంతో దానికి ప్రతీకారంగా నవంబర్ 9 రాత్రి నాజీ సైన్యం ఒక్కసారిగా యూదులపై విరుచుకు పడింది. 91 మందిని కాల్చి చంపారు. 30000 మందికి ఒకేసారి అరెస్ట్ చేసి concentration camp కి తరలించారు. యూదుల ప్రార్ధనా మందిరాలు తగులబెట్టారు. వారి షాపుల అద్దాలన్నీ పగలగొట్టారు. బెర్లిన్ అంతా గాజుముక్కలతో నిండిపోయింది. అందుకే దీనికి జర్మన్ భాషలో  Crystal Nacht అని పేరు వచ్చింది. అంటే "అద్దాలు పగిలిన రాత్రి".
 
ఇక అక్కడినుండి యూదుల నిర్భందం ప్రారంభమైంది. జైళ్ళు చాలక  concentration camp లు నిర్మించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కాంపుల్లో కుక్కారు. ఇక హిట్లర్ జర్మనీ విస్తరణ దిశగా దృష్టి సారించాడు. పశ్చిమాన  ఉన్న పోలాండ్ ని జర్మనీ తో కలిపేయాలని భావించాడు.అసలు ప్రపంచ పటంలో పోలాండ్ అనే దేశం ఉండరాదు అనేది హిట్లర్ ఆలోచన. అప్పటికి అత్యధికంగా 30 లక్షలమంది యూదులు ఉన్న దేశం పోలాండ్. అయితే పోల్స్ ఈ ప్రతిపాదన కి అంగీకరించలేదు. ఈలోగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ తో హిట్లర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలాండ్ ని తూర్పునుండి రష్యా, పశ్చిమం నుండి జర్మనీ ఆక్రమించుకోవాలని ఆ ఒప్పంద సారాంశం. దీనికి ప్రతిగా రష్యా జర్మన్ ఇతర ఆక్రమిత దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1939 న జర్మన్ బాంబర్లు ఎటువంటి హెచ్చరికా లేకుండానే పోలాండ్ ఆర్మీ పై విరుచుకు పడ్డాయి. మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించినా జర్మన్ నాజీల ధాటికి తట్టుకోలేక పోలాండ్ లొంగిపోయింది. సెప్టెంబర్ 17 న రష్యా తూర్పునుండి పోలాండ్ ని ఆక్రమించింది. ఈ విధంగా పోలాండ్ దేశం 1945 వరకు అస్తిత్వం లేకుండా ఇరు దేశాల ఆక్రమణలో ఉండిపోయింది. 30 లక్షలమంది యూదులు మరియు ఇతర పోల్స్ లక్షలాది మంది ఈ కాలంలో చంపబడ్డారు. వీళ్ళందరినీ చంపటానికి మొత్తం 48 డెత్ ఫాక్టరీ లు concentration camp ల పేరుతో పోలాండ్ మరియు జర్మనీ లలో నిర్మించారు. అత్యంత పెద్ద డెత్ ఫాక్టరీ పోలాండ్ లో auschwitz అనే ప్రాంతంలో నిర్మించారు. పోలాండ్లో నేను చూసిన తరువాతి ప్రదేశం ఇదే. చాలామంది మిత్రులు అది చూడవద్దని వారించారు. వారెందుకు అలా అన్నారో నాకు అర్ధం కాలేదు. కాని నేను ఈ ప్రదేశం చూశాక ఒక మనిషిగా చలించిపోయాను. చెలియల కట్ట కూడా ఆపలేని అశ్రువులు ధారగా కారుతుంటే అంతకుమించిన ఆవేదన నా మనసుని చిద్రం చేసింది. అసలు ఈ ప్రాంతం చూడకుండా ఉంటే బావుండేది అనిపించింది. ఇప్పటికీ,ఎప్పటికీ  ఆ డెత్ కాంప్ నేను మరువలేని మరణ సౌధం. సాటి మనుషుల్ని చంపటానికి మనుషులే నిర్మించిన ఆ సువిశాల మరణ ప్రాంగణం ఎన్ని రోదనలని భరించిందో, ఎంతమంది పసి వాళ్ళ ప్రాణాలు గ్యాస్ చాంబర్ల ఆకలికి బలై పోయాయో తలుచుకునప్పుడల్లా గుండె చెమ్మగిల్లిపోతుంది. 

Auschwitz అనే ప్రదేశం మేము ఉన్న మింజు జెర్జ్ కి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్లో వరుసగా వారం రోజులు సెలవు కావటంతో అక్కడి మాతోపాటు పనిచేసే స్థానిక మిత్రుడు మార్చిన్ క్రదోహా ( Marcin Krajdoha) ని అడిగితే తను తీసుకువెళ్తా అని చెప్పాడు. తరువాతి కాలంలో నేను చూసిన అన్ని ప్రదేశాలకి తానే గైడ్ గా వ్యవహరించాడు. మా స్నేహ బంధం ఇప్పటికీ అంతే ఆత్మీయంగా కొనసాగుతోంది.మింజు జేర్జ్ నుండి నవంబర్ న తోటి భారతీయ మిత్రులు ముగ్గురు ఉదయ్ అమ్మణ్ణ , శశి కుమార్, చోటురాం లతో కలిసి మార్చిన్ కారులో బయలుదేరాం. Auschwitz చూసి అక్కడినుంచి పోలాండ్ ఒకప్పటి రాజధాని అయిన క్రాకో పట్టణం మరియు జాకోపానా అనే పర్వతాలు చూడాలి అనేది మా ప్లాన్. పోలాండ్ కి దక్షిణంగా 5 గంటలు ప్రయాణించాక Auschwitz చేరుకున్నాం. దానిని ఇప్పుడు ఆష్విత్జ్ మ్యూజియం గా పిలుస్తున్నారు. మేము వెళ్ళే దారిలో ఉన్న పాడుబడిన రైలు పట్టాలని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు, ఈ పట్టాలమీదుగానే రైలు ఆ డెత్ కాంపులోకి వివిధ దేశాలనుంచి మనుషుల్ని తీసుకు వచ్చేది అని. పార్కింగ్ లో కార్ పార్క్ చేసి రుస్కి ఎంట్రన్స్ అనే గేటు గుండా టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. బయట 50 కి పైగా టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. అంతమంది జనాలు అక్కడ ఉన్నా కాని ఆ ప్రాంతం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.
 
మిగతా భాగాలకి ఇక్కడ క్లిక్ చేయండి
 
 
Dated : 09.08.2013