ఇక అక్కడినుండి ఈఫిల్ టవర్ వెళ్దామని మాక్సిం మారాం చెయ్యడం మొదలు పెట్టాడు. ఆ చిన్న పిల్లవాడికి ఈ చర్చ్ లు బిల్డింగ్ లు ఏం అర్ధం అవుతాయి. వాడికి ఈఫిల్ టవర్ మాత్రమే కావాలి. ఇక అక్కడినుండి మళ్ళీ మెట్రో ఎక్కి డైరెక్ట్ గా ఈఫిల్ టవర్ స్టేషన్లో దిగాము. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది , అప్పటిదాకా సినిమాల్లో చూసిన ఈ శతాబ్దపు ఏడో వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.అసలు విషయం మర్చిపోయా మన తెలుగు సినిమాల్లో మన్మధుడు లో చూపించినట్లు గా పారిస్ ని ఇంకెవరూ చూపించలేదేమో. మేము పారిస్ లో ఉన్నంత సేపు ఎస్కలేటర్ చూసినా సీన్ నది మీద వంతెన చూసినా బ్రహ్మి డైలాగులే గుర్తొచ్చాయి. నీళ్ళంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకే వంతెనలు కట్టారు అని నేను భార్గవి అవన్నీ చెప్పుకుని నవ్వుకుంటుంటే మార్చిన్ వాళ్ళకి అర్ధం కాలేదు. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. ఆ అనుభూతి చెందిన క్షణం ఇప్పటికీ మరిచిపోలేనిది.మన్మదుడులో మొదటి సారి ఈఫిల్ టవర్ ని ఎలా చూపించాడో మేము చూసినపుడు కూడా అలాంటి దర్శనమే జరిగింది. లవ్ సిటీ అని పారిస్ ని ఎందుకంటారో ఈఫిల్ టవర్ దగ్గర టూరిస్ట్ లని చూడగానే అనిపించింది. 20 ఏళ్ల వయసున్న జంటల దగ్గరనుండి 70 ఏళ్ల వయసున్న జంటలు ఈఫిల్ టవర్ పైకి వెళ్ళటానికి క్యూ లో నిలబడి ఉన్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఒకరి కొకరు అధరచుంబనాల తో తమ ప్రేమని వ్యక్తీకరించుకుంటున్నారు. టికెట్ కౌంటర్ పక్కనే ఈ టవర్ నిర్మాణ కర్త ఈఫిల్ విగ్రహం ఉంది. కొంతకాలం ఈఫిల్ ఈ టవర్ పై ఉన్న గదిలో నివాసం ఉండేవాడు.
1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ ఇరవై కోట్లు మందికి పైగా దీన్ని సందర్శించారు . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది 2006 లో సందర్శించారు.దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.
ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. దీనికి 2 అంతస్థులు ఉన్నాయి మొదటి అంతస్థు వరకే అయితే 11 యూరోలు టికెట్ , అదే చివరి వరకు అయితే 17 యూరోలు. మేము మొత్తం పైకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము టికెట్ తీసుకుని పైకి వెళ్ళటానికే గంట పట్టింది. ఇలా 365 రోజులు జనాలు క్యూ లో పైకి వెళుతూనే ఉంటారు. పై నుండి పారిస్ నగరం మొత్తం అద్భుతంగా కనిపించింది. నగరం మొత్తం అందులో భవనాలన్నీ ఎవరో పెయింట్ వేసిన కాన్వాస్ లా అనిపించింది. అక్కడి నుండే గుయ్ మెట్ మ్యూజియం ఎక్కడుందా అని వెతికాను. నా దగ్గరున్న మాప్ ప్రకారం చూస్తే గుయ్ మెట్ ఈ టవర్ కి దగ్గరలోనే ఉండాలి. టవర్ కి అభిముఖంగా దగ్గరలోనే ఈ మ్యూజియం కనిపించింది. అక్కడినుండే ఒక ఫోటో తీశాను.