అప్పటికి సమయం ఉదయం 11 అయింది ప్రయాణ బడలికగా ఉండటంతో కాసేపు విశ్రాంతి తీసుకుని కిందకి వచ్చి పిజ్జా తిని నీళ్ళలో తేలియాడే వెనిస్ నగర వీధుల్ని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరాం. వెనిస్ ను క్రీ.శ 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో ఇక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అసలు ఆ ఇళ్ళల్లో ఎవరూ నివసించటం లేదు. ఆ దీవి మొత్తం తిరగటానికి పడవలే ఆధారం ఇది దాదాపు 140 దీవుల సమూహం. ఒక దీవి నుండి మరో దీవికి పడవలో వెళ్ళటం అక్కడ దిగి కాసేపు ఆ ప్రాంతంలో గడిపి మళ్లీ అక్కడికి వచ్చే తరువాతి పడవ ఎక్కి వేరే దీవికి వెళ్ళటం. రోజుకి 11 యూరోలు కట్టి టికెట్ కొంటే ఆ రోజంతా ఆ దీవుల్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి.
మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట! మేము మొదటి రోజు పాస్ కొనలేదు. వెనిస్ నగర వీధుల్లో నడుస్త్తూ ఆ పురాతన భవంతుల వైభవాన్ని చూస్తుంటే ఎన్నేళ్ళ క్రితం వాటిని నిర్మించారో అనిపించింది. ఎటు చూసినా సావనీర్లు అమ్మేషాపులు , రకరకాల ఫాషన్ దుస్తులు , ఆభరణాల దుకాణాలు కనిపిస్తాయి. భార్గవి అక్కడ షాపులో వస్తువులన్నీ చూసి వాటి ధరలు యూరోల్లో చూడగానే గబగబా ఇండియా రూపాయల్లో లెక్క వేసేసి మన హైదరాబాద్ లో అయితే ఇందులో సగం కంటే తక్కువే అని నిట్టూర్చేది. ఏది కొనుక్కోమని చెప్పినా నాకు అసలు ప్రాణం ఒప్పట్లేదంటూ తిరిగి వచ్చేసింది. చివరికి ఏవో ఐటమ్స్ మాత్రం బాగా నచ్చటంతో వదల్లేక కొనుక్కుంది. ఆ రోజంతా అక్కడ దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని చూస్తూ గడిపాం. కాసేపటికి చీకటి పడేసరికీ అంతా మారిపోయింది .వెనిస్ అంతా ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతోంది . మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్, మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతున్నారు. అసలు రాత్రి పూట వెనిస్ చాలా రొమాంటిక్ గా అనిపించింది.
మళ్ళీ ఆత్మారాముడు గోల చేస్తుండటంతో అక్కడే నీటి మధ్యలోనే ఉన్న ఒక రెస్టారెంట్ ని చూసుకుని నేను పిజ్జా తో పాటు వైన్ ఆర్డర్ చేశాను. భార్గవి మాత్రం తనకి పాస్తా కావాలి అంది.ఇండియా లో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాలా తేడా వుంది. చీజ్ ఎన్నో రకాలు ఉంటుంది . ఒకే పిజ్జా మీద రక రకాల చీజులు వేస్తారు.మాకు సర్వ్ చేసిన వ్యక్తి ఇటాలియన్ దేశస్తుడే. తను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాడట. ఏవో రెండు మూడు ఉర్దూ పదాలతో మమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. వెనిస్ లో అలా రాత్రి పూట వెలుగులో నీళ్ళలో తేలియాడుతూ భోజనం చేయటం తీయని అనుభూతిని ఇచ్చింది. ఇక ఆ రోజుకి మా సందర్శన ముగించుకుని అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు మొత్తం అక్కడున్న దీవుల్లో కొన్నైనా చూడాలనుకున్నాం.ముందుగా వెనిస్ లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. యూరప్లో ఉన్న మిగతా దేశాలనుండి అలాగే ఇటలీ లోని మిగతా నగరాలనుండి వచ్చే ట్రైన్స్ అక్కడ ఆగుతాయి. అక్కడ ఆగి ఉన్న కొన్ని రైళ్ళని చూశాం. బోగీలన్నీసకల వసతులతో ఉన్నాయి. నేను ఇంతకుముందు పోలాండ్ లో వెళ్ళిన వార్సా రైల్ కంటే ఇది చాలా బాగుంది. ఇక అక్కడినుండి 10 గంటలకల్లా డే టికెట్ తీసుకుని బోటులో బయలుదేరి ఒక్కో దీవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి.
అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాలా అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి. మేము ఎక్కువ సేపు ఈ ప్రాంతంలోనే గడిపాము. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో మరో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి.