నా ఐరోపా యాత్ర - 15 (స్వీడన్)Back to list

నా ఐరోపా యాత్ర - 15 (స్వీడన్)

మరుసటి రోజున శరవణన్ కి ఆఫీస్ ఉండటంతో తను పొద్దుటే లేచి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. శశి , నేను తాపీగా రెడీ అయ్యి 10 గంటలకి శరవణన్ ఆఫీస్ కి చేరుకున్నాము. వాళ్ళ ఆఫీస్ అంతా తిప్పి చూపించాడు. మా తిరుగు ఫ్లైట్ ఆ రోజు సాయంత్రం కావటంతో సిటీ అంతా చూద్దామని శశి నేను బయలుదేరాం. అక్కడికి దగ్గరలోనే ఒక షిప్ మ్యూజియం ఉందని తెలియటంతో ముందుగా అది చూద్దామని బోటు ఎక్కాము. స్వీడన్ నగరం అంతా మధ్యలో సముద్రం వాటి మీద వంతెనలతో ఎంతో అందంగా ఉంటుంది.
పార్లమెంట్ దగ్గర 
 
నేను ఇంతకుముందు చెప్పినట్లు యాక్సెస్ కార్డు తో ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయినా ప్రయాణం చెయ్యవచ్చు. అది ఉపయోగించి అక్కడున్న బోటు లో షిప్ మ్యూజియం కి చేరుకున్నాము. ఈ మ్యూజియం పేరు వాసా ముసీట్ (స్వీడిష్ భాషలో ముసీట్ అంటే మ్యూజియం). దీనికి ప్రవేశ రుసుము 200 స్వీడిష్ క్రోనాలు. ఈ నౌక వెనుక పలు ఆసక్తి కరమైన విషయాలు అక్కడున్న గైడ్ వివరించింది. 1626 లో స్వీడన్ రాజు Gaustav II Adolf పోలాండ్ మీద యుద్ధం చెయ్యటానికి ఒక యుద్ధనౌక ని నిర్మించాలని అనుకున్నాడు. దీనికోసం హెన్రీ అనే ఒక డచ్ ఇంజినీర్ ని నియమించాడు. స్టాక్ హోం షిప్ యార్డులో 1626 లో దీని నిర్మాణం ప్రారంభమై ఒక సంవత్సరం తరువాత 1627 సంవత్సరాంతానికి ఆ షిప్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికిగాను టన్నుల కొద్దీ ఓక్ వృక్షాల కలపని వినియోగించారు.స్వీడన్లో విరివిగా లభించే రాగి మరియు ఇతర లోహాలని వినియోగించారు. ఈ నిర్మాణ కాలంలోనే షిప్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ అనారోగ్యంతో మరణించాడు.మొత్తం 3 డెక్ లతో ఈ షిప్ నిర్మాణం జరిగింది. 1628 ఆగస్టు 10 వ తేదీన వాసా నౌక పోలాండ్ పై యుద్ధానికి బాల్టిక్ సముద్రపు జలాల్లోకి ప్రవేశించింది. కొన్ని వేలమంది స్వీడన్లు, మిగతా దేశాల అంబాసిడర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడటానికి విచ్చేశారు. కాని అప్పుడే జరిగింది ఓ అనుకోని దురదృష్ట సంఘటన. సముద్రంలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లోనే, అందరూ చూస్తుండగానే ఆ నౌక మునిగిపోయింది. కొన్ని వందలమంది అక్కడే జల సమాధి అయిపోయారు. ఏ లక్ష్యంతో అయితే ఆ నౌక ని వ్యయప్రయాసలకోర్చి నిర్మించారో అది నెరవేరకుండానే వాసా మునిగిపోయింది. ఇది స్వీడన్ కి కోలుకోలేని దెబ్బ.
 
 
అంత చిన్న దేశానికి ఆ ఖర్చుని తట్టుకొనే శక్తి అప్పటికి లేదు. అదీ కాకుండా మిగతా దేశాలముందు అవమానం. ఆగస్టు 27 నాటికల్లా Gaustav II Adolf ఈ ప్రమాదానికి సంభందించిన నివేదిక తెప్పించుకున్నాడు. నిర్మాణంలో లోపాలే కాకుండా, కెప్టెన్ తప్పిదము కూడా కారణమని తేల్చారు. ఈ ప్రమాదంలో బయటపడి ప్రాణాలు దక్కించుకున్న కెప్టెన్ హన్సన్ జైలు పాలయ్యాడు. ఆ నౌకలో ఉన్న కొన్ని ఫిరంగులను 1680 లో వెలికి తీసారు. అప్పటికే 50 సంవత్సరాలు అవటంతో షిప్ అంతా లోపల అంతా మట్టి పేరుకుపోయింది. ఆ తరువాత మళ్ళీ 1950 వరకు ఎవరూ దానిని పట్టించుకోలేదు. దాదాపు 333 సంవత్సరాల తరువాత ఆ నౌకని వెలికి తీయాలని స్వీడన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా స్వీడిష్ నేవీ అధికారులు ప్రణాళిక తయారు చేసారు. అసలు అన్నేళ్ల తరువాత ఆ షిప్ యధాతధంగా ఉంటుందా అనే అనుమానాలు ఎదురయ్యాయి. మొత్తమ్మీద 18 లిఫ్ట్ ల సాయంతో 1959 సెప్టెంబర్ నాటికి సముద్రం అడుగునుండి 32 మీటర్ల ఎత్తుకి ఈ షిప్ ని లేపారు. అప్పటికే ఇనుము అంతా తుప్పు పట్టిపోయింది.ఇంకా 16 మీటర్లు పైకి లేపితే ఈ నౌక సముద్ర ఉపరితలం పైకి కనిపిస్తుంది. ఆ 16 మీటర్లు లేపటానికి మరో ఏడాది నర్ర పట్టింది. 
1961 ఏప్రిల్ 8 న మిగతా భాగాన్ని లేపటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మీడియా మొత్తం దీనిని కవర్ చేయటానికి స్టాక్ హోం చేరుకుంది. జరుగుతున్న ప్రక్రియ అంతా తమ కెమెరాల్లో బంధించారు. అంతిమంగా ఏప్రిల్ 24 న 333 ఏళ్ల తరువాత వాసా నౌక ప్రపంచానికి కనిపించింది.
 
వాసా మొదటిసారి ప్రపంచానికి కనిపించిన దృశ్యం
 
ఇక దానిని శుభ్రం చేయటానికే మరో ఏడాది పట్టింది. దీనికోసం హై ప్రెజర్ వాటర్ స్ప్రేయర్స్ ఉపయోగించారు. దాదాపు 40000 వస్తువులు ఈ నౌకలో లభించాయి. కాని విచిత్రమేమిటంటే 85 శాతం నౌక యధాతధంగా ఉంది. కలప పాడవటం కాని ముక్కలు అవటంగాని జరగలేదు. 333 ఏళ్ల క్రితం వేసిన పెయింట్ యధాతధంగా ఉంది. ఈ పెయింట్ లలో ఏమి ఉపయోగించారనే అంశం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.
 
1961 నుండి 1988 వరకు తాత్కాలికంగా Wasavarvet అనే తాత్కాలిక మ్యూజియంలో ఈ షిప్ ని ఉంచారు. కాని సందర్శకులకి షిప్ మొత్తాన్ని ఒకేసారి చూడటం వీలయ్యేది కాదు.అలా అని ఈ షిప్ ని తరలించటం కష్ట సాధ్యమైన పని. అందుకోసమని 1981 లో స్వీడన్ ప్రభుత్వం ఈ షిప్ ఉన్న చోటునే ఉంచి దాని చుట్టూ మ్యూజియం నిర్మాణాన్ని ప్రారంభించింది.1990 నాటికి అది పూర్తయ్యి సందర్శకులకి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక మినీ ధియేటర్ ఉంది. ఈ షిప్ వెలికి తీసిన 1968 నాటి దృశ్యాలు మరియు ఈ నౌక సమగ్ర చరిత్ర అంతా 20 నిమిషాల పాటు ప్రదర్శిస్తారు.కాని నిజంగా అన్నేళ్ల తరువాత కూడా ఆ షిప్ ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. 2011 లో అత్యధికంగా టూరిస్టులు దీనిని దర్శించారు.అక్కడినుండి బయటకి రాగానే ఎదురుగా నోర్డికా ముసీట్ అనే మరో మ్యూజియం ఉంది. మాకు సమయం లేకపోవటంతో అక్కడినుండి ట్రాము ఎక్కి స్వీడన్ పార్లమెంట్ భవనం చేరుకున్నాం. ఇది చాలా పెద్దది, అక్కడినుండి అన్నీ చూసుకుంటూ శరవణన్ ఆఫీసుకి వెళ్లి పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంటులో పిజ్జా తిని అందరం నడుచుకుంటూ స్వీడన్ సిటీ హాలుకి వెళ్ళాము.నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసే హాలులో ఉన్నామన్న ఊహే అద్భుతంగా అనిపించింది.
 
 
​నోబెల్ బహుమతి ప్రదానం చేసే సిటీ హాల్ 
 
అక్కడినుండి మెట్రోలో బయలుదేరి బస్సు స్టేషన్ కి చేరుకున్నాము.మా పర్యటనలో శరవణన్, అన్బు మరియు వారి మిత్రులు చూపించిన ఆదరణ మరువలేనిది. స్వీడన్ జ్ఞాపకాలన్నీ పదిలంగా దాచుకుంటూ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. 6.30 నిమిషాలకి స్కవస్తా ఎయిర్ పోర్ట్ నుండి పోజ్ నాన్ కి బయలుదేరాము. 

ఇప్పటిదాకా నా ఐరోపా యాత్ర అంతా నేను బ్రహ్మచారిగా ఉన్న సమయంలోనే సాగింది. తరువాత నేను పర్యటించిన ఇటలీ, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాలన్నీ 2013 ఫిబ్రవరిలో నాకు వివాహం అయ్యాక నా శ్రీమతి భార్గవితోనే ప్రయాణించాను.

వచ్చేవారం -  బాద్షా సినిమా కోసం మా బెర్లిన్ ప్రయాణం.
 
మిగతా భాగాలకి ఇక్కడ క్లిక్ చేయండి
 
29.03.2014