వందేళ్ళ పంచాయితీBack to list

వందేళ్ళ పంచాయితీ

గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు అనే అవగాహన వచ్చాక నేనెరిగిన మొదటి వ్యక్తి శ్రీ సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారు.1988 నుండి 1995 వరకు మన గ్రామానికి సర్పంచ్ గా ఆయన సేవలందించారు. అప్పటికి 75 సంవత్సరాల ఘంటసాల గ్రామ పంచాయితీ చరిత్రలో తొలి కమ్మేతర సర్పంచ్ ఆయనే. అప్పటిదాకా 10 మంది కమ్మ సామాజిక వర్గం నుండే ఈ పదవికి ప్రాతినిధ్యం వహించారు. సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారి హయాంలో నేను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమైన కార్యక్రమాలు రెండు. ఒకటి మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవం. రెండు పంచాయితీ వజ్రోత్సవాలు. 1993 నాటికి పంచాయితీ ఏర్పడి 75 సంవత్సరాలు కావటంతో ఆ వేడుకలని వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో పాల్గొన్న జ్ఞాపకాలు నాకున్నాయి. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ రాజీవ్ శర్మ ముఖ్య అతిధిగా జలధీశ్వరాలయం ముందు ఆవరణలో ఈ వేడుకలు నిర్వహించారు. అప్పట్లోనే పంచాయితీ సావనీర్ ని ముద్రించారు.అప్పటిదాకా జరిగిన అభివృద్ధి కార్య క్రమాల ఛాయా చిత్రాలతో పాటు గ్రామాభివృద్ది కమిటీ కృషిని కూడా అందులో వివరించారు. గ్రామంలో ఉన్న షాపుల వారంతా ఆ సావనేర్ ముద్రణకి ప్రకటనల రూపంలో విరాళాలు ఇచ్చారు. ఆ కాపీ ఒకటి ఇప్పటికీ నా దగ్గర ఉంది. రెండేళ్ళ క్రితం వరకు ఈ వేడుకలకి సంభందించిన శిలా ఫలకం ఆలయం ముందున్న మండపంలోనే ఉండేది. ఇటీవల దేవాలయ అభివృద్దిలో భాగంగా మండపంతోపాటు ఆ ఫలకాన్ని కూడా తొలగించారు.



పంచాయితీ పాత కార్యాలయం ( అంతర చిత్రంలో శిలా ఫలకం )

మరొక ముఖ్య కార్యక్రమం ఎన్ టి ఆర్ ముఖ్య అతిధిగా 1991 లో ప్రారంభించిన మంచినీళ్ళ టాంక్. ఈ రెండూ నేను ప్రత్యక్షంగా చూసిన అంశాలు.ఇప్పటిదాకా పనిచేసిన 14 మంది సర్పంచుల్లో 5 గురు వేమూరి వారు, 3 గురు గొర్రెపాటి వారు కాగా, దోనేపూడి, తుమ్మల, బండి వారినుండి ఒక్కొకరు చొప్పున ఈ పదవిలో పనిచేశారు. వెనుకబడిన వర్గాలనుండి తొలి సర్పంచ్ గా రికార్డ్ మాత్రం శ్రీ పాల మారమ్మ గారిది. 2001 నుండి 2006 వరకు ఈవిడ ఆ పదవిలో ఉన్నారు. ఇక గ్రామంలో అత్యధిక జనాభా కలిగి కూడా అధికారానికి నోచుకోని పద్మ శాలీల వర్గం నుండి 2006 లో శ్రీ  అందె జగదీశ్ ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈయన హయాం లోనే కూరగాయల మార్కెట్, నూతన పంచాయితీ భవనం ముందు మహనీయుల విగ్రహాల ఏర్పాటు జరిగాయి.మొదట్లో పంచాయితీ బోర్డ్ వ్యవస్థ ఉండేది. దానికి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఉండేవారు. 1918 నుండి 1934 దాకా ఉన్న పంచాయితీ బోర్డు కి తోలి చైర్మన్ వేమూరి వెంకయ్య గారు, వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకయ్య గారు.16 సంవత్సరాల పాటు ఈ ఎన్నిక ఏకగ్రీవమే.అప్పట్లో ఘంటసాల పాలెం కూడా ఒకే పంచాయితీ కింద ఉండేది. 1934 లో  ఘంటసాల పాలెం వారికి అవకాశం కల్పించే విషయంలో ఆ గ్రామానికి చెందిన వేమూరి నాగయ్య గారిని చైర్మన్ గా ఎన్నుకున్నారు.ఆ కాలంలో నే ముఠా తగాదాలు జరిగి పాలెం వారు వేరే పంచాయితీ కావాలంటూ కోర్టుకెక్కడంతో ఘంటసాల పాలెం పంచాయితీ వేరు పడింది. ఘంటసాల పంచాయితీ వేరు పడ్డాక తోలి సర్పంచ్ గొర్రెపాటి వెంకట్రామయ్య గారు.1947 లో స్వాతంత్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికలో గెలిచిన వ్యక్తి వేమూరి గోపాల కృష్ణయ్య గారు. తదనంతరం తుమ్మల వెంకట్రామయ్య గారు (వర్లు గారి మామగారు).తరువాత గొర్రెపాటి మహా లక్షమ్మ గారు (గొర్రెపాటి చంద్రశేఖర్ రావు గారి తల్లిగారు),ఈవిడ సర్పంచ్ గా ఉన్న సమయంలోనే దేవరకోట ప్రెసిడెంట్ గా వీరి మేనమామ గారు, ఘంటసాల పాలెం ప్రెసిడెంట్ గా వీరి తమ్ముడైన వేమూరి వెంకట కృష్ణారావు గారు పనిచెయ్యటం విశేషం. ఇక 1959 నుండి 1964 దాకా పనిచేసిన దోనేపూడి సీతారామయ్య గారి కాలం స్వర్ణయుగం అనే చెప్పాలి.పక్కా రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగాయి. గ్రామానికి విద్యుత్తు ,టెలిఫోను, టెలిగ్రాం సౌకర్యాలు వచ్చింది ఈ కాలంలోనే. అందుకే పంచాయితీ భవనానికి దోనేపూడి సీతారామయ్య భవన్ అనే పేరు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎన్నికైన గొర్రెపాటి బుల్లెయ్య చౌదరి గారు 10 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడ్డాక దీర్ఘ కాలం పని చేసిన రికార్డ్ ఈయనదే. తరువాత ఎన్నికైన బండి లక్ష్మీ నారాయణ గారిది మరో రికార్డు. అతి తక్కువ కాలం పదవిలో ఉన్నది ఈయనే, కేవలం 15 నెలల పాటు మాత్రమె ఆ పదవిలో ఉన్నారు. 1981 లో ఎన్నికైన వేమూరి నాంచారయ్య గారు ఏడు సంవత్సరాలు ఈ పదవిని నిర్వహించారు. ఈయన హయాంలోనే మంచినీళ్ళ టాంక్ కి అంకురార్పణ జరిగింది. బోరు నీళ్ళ కోసం ఊరు దాటి వెళ్ళాల్సిన పరిస్తితులనుండి రక్షిత మంచినీటి పధకం ద్వారా ఇంటింటికి మంచినీళ్ళ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 1995 నుండి 2001 దాకా నాంచారయ్య గారి కుమారుడు వేమూరి పండుబాబు గారు సర్పంచ్ గా పని చేశారు. తరువాత ఈ స్థానం రిజర్వు కావటంతో శ్రీ పాల మారమ్మ, శ్రీ అందె జగదీష్ వరుసగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఈ స్థానం బి సి మహిళ కావటంతో మళ్ళీ పద్మశాలీల సామాజిక వర్గానికి చెందిన వారే బరిలో ఉన్నారు. మాకు ఊహ తెలిసాక పంచాయితీ జలదీశ్వరాలయం ముందు ఉన్న మండపం పై అంతస్తులో ఉండేది.ఇప్పుడు ఆలయం వెనుక నూతన భవనం నిర్మించి అందులోకి మార్చారు.
 
 
 
మొత్తం 14 వార్డులున్న మన పంచాయితీలో 3 స్థానాలనుండి మాత్రమే అగ్రవర్ణాలు పోటీ పడుతున్నాయి. మిగతా స్థానాలన్నీ వెనుకబడిన సామాజిక వర్గాలకి కేటాయించారు. మెజారిటీ వార్డు మెంబర్లు ప్రతిపాదించిన వ్యక్తి ఉప సర్పంచ్ అవుతారు. 18-04-2018 నాటికి పంచాయితీ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తవుతాయి. అంటే ఇప్పుడు ఎన్నికవబోయే వ్యక్తి వందేళ్ళ పంచాయితీకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఆ అదృష్టవంతులెవరో తెలుసుకోవాలంటే జులై 30 దాకా వేచి చూడాల్సిందే.

తెది ః ౧౫.౦౭.౨౦౧౩

 

This text will be replaced