తన జీవితం లో చేస్తూ వచ్చినట్లే తన జీవిత చరిత్ర రచన లో సైతం ఆ మంచిని చూడటానికే ప్రయత్నించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు కించిత్తు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ,ఎవరి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా తన జీవిత చరిత్ర ని రాసుకున్న వ్యక్తిగా గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు చరిత్ర లో నిలిచిపోతారు.1898 నుంచి 1984 వరకు 86 ఏళ్ళు బ్రతికి ,అందులో ఎక్కువ భాగం క్రియా శీల రాజకీయాల్లో తల మునకలు గా బ్రతికిన వ్యక్తికి సహజం గానే పరిచయాలు మెండు. వాళ్ళందరి గురించి తనకు తెల్సిన మంచి విషయాలు మాత్రమే రాయటం బహుశా ఆయనకొక్కరికే సాధ్యమైన పనేమో.
1978 లో మొదటి సారిగా ఈ పుస్తకం ముద్రించబడినది.ఆ తరువాత డిసెంబర్ 2009 లో బ్రహ్మ్మయ్యగారి మనుమడు కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ ఈ పుస్తకాన్ని పునర్ముద్రించి ఆనాటి ముఖ్య మంత్రి రోశయ్య చేతుల మీదుగా శాసన మండలి జూబ్లీ హాలు లో ఆవిష్కరింప చేశారు.