వీరపనేని సుబ్రహ్మణ్యం , పరిచయం అవసరం లేని పేరు అనేకంటే ఈ తరానికి పరిచయం చెయ్యాల్సిన పేరు అనటం సబబు. ఎందుకంటే మన గ్రామంలో జన్మించి ఇక్కడే చదువుకుని హైదరాబాద్ లో స్థిరపడిన ఘంటసాల ముద్దు బిడ్డ వీరు . పరిచయం చేయాల్సిన పేరు అని ఎందుకు చెప్పానంటే , గ్రామభివ్రుద్దిలో పాల్గొంటూ జన్మ భూమి కోసం ఎంత ఖర్చు చేసినా ఏనాడూ తమ ఉనికిని పెద్దగా చాటుకోవటానికి ఇష్టపడని వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్యం . తమ తాతల, తండ్రుల వారసత్వ ఆస్తి మీద మనకి హక్కులు ఉండకూడదు అని బలంగా నమ్మే వీరపనేని సుబ్రహ్మణ్యం గారు అభ్యుదయ వాది. అదే అభ్యుదయ వాదంతో ఆరేళ్ళ క్రితం గ్రామంలో అసలు ఎవ్వరూ ఊహించని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామం అంటే బడి, గుడి తో పాటు మన ఆఖరి మజిలీ అయిన స్మశానం కూడా అని గుర్తు చేస్తూ తన వంతు సాయంగా 25 లక్షలతో స్మశానాన్ని అత్యంత సుందరమైన పార్కుగా తీర్చిదిద్ది నేటికి మొత్తం 45 లక్షలతో అభివృద్ధి చేసి మిగతా నిధులు దాతల ప్రోత్సాహంతో సమీకరించి , ఇంకా స్వంత నిధులు ఇస్తూ చుట్టూ ప్రహరీ గోడలు కట్టి దానిలో గ్రామానికి వీరపునేని సరోజినీ పార్క్ , కమ్యూనిటీ భవనాలు నిర్మించి ,పక్కనే వున్న శ్మశానవాటిక లో భవనాలు ఏర్పరచినారు . ఇంకా దీని అభివృద్ధి కి ఆలోచనలు చేస్తున్నారు. మనఘంటసాల డాట్ నెట్ ప్రోత్సాహం , గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 30 తేదీ ఆదివారం ఈ అభివృద్ధిచేసిన ప్రాజెక్ట్ చూసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు , ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖామాత్యులు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు , మాజీ శాసనసభ్యులు పాటూరి రామయ్య గారు వీరపనేని సుభ్రమణ్యం గారిని అభినందించారు . ఏ పల్లె లో ను ఇంతటి ప్రాజెక్ట్ చేయలేదని చెప్పారు. ఎన్నో సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ శాంతి వనం గ్రామస్తులకి రుద్రభూమిగా మాత్రమే కాకుండా ఎన్నో కార్యక్రమాలకి ఉపయోగపడుతోంది. ఈ సంధర్భంలో మన ఘంటసాల ముద్దుబిడ్డ, అభ్యుదయ వాది, శ్రీ వీరపనేని సుబ్రహ్మణ్యం గారి కృషిని గ్రామస్తులు ప్రశంసిస్తూ వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.
Dated : 31.12.2018